హైదరాబాద్, 8 అక్టోబర్ (హి.స.)
యావత్ దేశానికే తలమానికంగా నిలిచిన తెలంగాణ సంక్షేమ గురుకులాలకు అద్దెలు పేరుకుపోయి చివరికి తాళాలు వేసే దుస్థితి రావడం అత్యంత దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. విద్యాశాఖను తన వద్దే పెట్టుకున్న ముఖ్యమంత్రి, గురుకుల భవనాలకు ఏకంగా ఏడాది కాలం నుంచి అద్దెబకాయిలు చెల్లించకపోవడం రేవంత్ రెడ్డి అసమర్థతకు, చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు.
పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన ఈ అత్యుత్తమ వ్యవస్థను కుప్పకూల్చి కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలన్న కుట్రలో భాగంగానే సీఎం రేవంత్ ఇదంతా చేస్తున్నట్టు అనుమానం కలుగుతోందని కేటీఆర్ అన్నారు. ఓవైపు ఫీజు రీయింబర్స్మెంట్బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల భవితవ్యాన్ని అంధకారంలోకి నెడుతున్న ముఖ్యమంత్రి సంక్షేమ గురుకులాలను కూడా సమాధి చేసే పన్నాగాలు చేస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు