
కరీంనగర్, 12 నవంబర్ (హి.స.)
ధాన్యాన్ని కాంటా వేయడంలో
అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పీచుపల్లె గ్రామ రైతులు రోడ్డెక్కారు. బుధవారం కొనుగోలు సెంటర్ వద్ద రోడ్డుపై రైతులు ధర్నా నిర్వహించారు. కల్లాల్లో ధాన్యం పోసి నెలరోజులు గడుస్తున్నా కాంటా చేయడంలో నిర్వాహకులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సెంటర్ నిర్వాహకులను, పౌర సరఫరాల అధికారిని ఎవరిని అడిగినా రేపు మాపు అంటూ నెల రోజులుగా పట్టించుకోవడం లేదని, క్వింటాలుకు మూడు నాలుగు కిలోలు అదనంగా కాంట వేయనిస్తేనే ధాన్యం కాంట పెడతామని సెంటర్ ఇన్చార్జి అంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం వెంటనే తూకం వేసి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు