
అమరావతి, 13 నవంబర్ (హి.స.)ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు యూపీఎస్సీ సివిల్స్ ఉచిత శిక్షణ ఇస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి తెలిపారు. అర్హులైనవారు సద్వినియోగం చేసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. రాష్ట్రంలో 340 మందికి ఉచిత శిక్షణ అందించనున్నట్టు పేర్కొన్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిల్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టడీ సర్కిళ్లలో ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. డిసెంబరు 10 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీ వరకు నాలుగు నెలల పాటు నిర్వహించే శిక్షణలో అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నామని తెలిపారు. మరిన్ని వివరాలకు ఏపీ స్టడీ సర్కిల్ వెబ్సైట్ను సందర్శించాలని మంత్రి సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ