
అమరావతి, 25 నవంబర్ (హి.స.)
నైరుతి బంగాళఖాతం, దక్షిణ శ్రీలంక సమీపంలో ఉపరితల ఆవర్తనం అల్ప పీడనంగా మారింది. ఈ అల్ప పీడనం ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి మరింత బలపడి వాయుగుండంగా మారే ఆవకాశం ఉందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి తెలిపారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ప్రాంతంలో విస్తారంగా వర్షాలు పడే అవకాశాలున్నాయన్నారు. గురువారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది
మరోవైపు దక్షిణ అండమాన్, మలక్కా జలసంధి వద్ద ఏర్పడిన ఆల్పపీడనం వాయుగుండంగా మారింది. అండమాన్ ప్రాంతానికి 750 కిలోమీటర్ల దూరంలో ఈ వాయుగుండం కొనసాగుతోంది. రాబోయే రెండురోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి, మరింతగా బలపడుతుంది. దీని ప్రభావంతో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2వ తేద వరకు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది
ప్రస్తుతం ఈ వాయుగుండం మలేసియాలోని జార్జ్టౌన్కు 70 కి.మీ. దూరంలోనూ, ఇండోనేసియాలోని కుటామక్మూర్కు 290 కి.మీ. దూరంలోనూ, అండమాన్ నికోబార్ దీవులకు 750 కి.మీ. దూరంలోనూ ( కేంద్రీకృతమై ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో రైతులు అప్రమత్తమై వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ