
అమరావతి, 26 నవంబర్ (హి.స.)
రాజధాని అమరావతికి ముఖ ద్వారంగా ఉన్న మంగళగిరి రైల్వేస్టేషన్ నూతన హంగులు సంతరించుకుంటోంది. రాష్ట్రం నలుమూలల నుంచి రాజధానికి వచ్చే ప్రయాణికులకు ఇక్కటి సంస్కృతి, సంప్రదాయాలు కళ్లకు కట్టినట్టుగా చూపించేందుకు చిత్రాలు, బొమ్మలతో తీర్చిదిద్దారు. స్వాగత ద్వారం నుంచి లోపలి వెళ్లే మార్గంతోపాటు ఆవరణ పచ్చదనంతో కళకళలాడుతోంది. విశాలమైన పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ‘అమృత్ భారత్’ పథకంలో భాగంగా రూ.12.06 కోట్లతో చేస్తున్న పనులు తుది దశకు చేరుకున్నాయి. వృద్ధులు, దివ్యాంగులకు లిఫ్ట్ సౌకర్యం, ఇతర అధునాతన సౌకర్యాలు కల్పించారు. అన్ని విభాగాలను పూర్తిస్థాయిలో ఆధునికీకరించారు. రెండు ఫ్లాట్ఫాంలు ఉండగా.. నాలుగుకు పెంచారు. ప్రయాణికుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించారు. ప్రస్తుతం 36 రైళ్లకు హాల్ట్ ఉంది. భవిష్యత్తులో మరిన్ని రైళ్లు నిలిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజధాని అమరావతిలో ఉద్యోగుల కోసం సికింద్రాబాద్ నుంచి ఓ రైలు ప్రత్యేకంగా నడుపుతున్నారు. రాజధానిలో అతి పెద్ద రైల్వే స్టేషన్గా మంగళగిరి స్టేషన్ను తీర్చిదిద్దుతున్నారు. జనవరి నాటికి పూర్తి చేసి ప్రారంభించాలని సంకల్పించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ