
కామారెడ్డి, 27 నవంబర్ (హి.స.) గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు
ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన పారదర్శకమైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత పోలీసుల దేనని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పోలీస్ సిబ్బందికి సూచించారు. రామారెడ్డి మండలంలోని రామారెడ్డి, పోసానిపేట్ గ్రామ పంచాయతీలు, మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచారెడ్డి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్, పోలింగ్ కేంద్రాలను ఆయన గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్బంగా నామినేషన్ కేంద్రాల్లో విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందితో ఎస్పీ ప్రత్యేకంగా మాట్లాడారు. ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్ ప్రక్రియ పూర్తిగా నిష్పక్షపాతంగా, శాంతియుతంగా జరిగేలా పని చేయాలని పలు సూచనలు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు