
హైదరాబాద్, 3 నవంబర్ (హి.స.)
కంకర లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రయాణికులతో బస్సు తాండూరు నుంచి హైదారాబాద్కు వెళ్తాంది. ఈ నేపథ్యంలోనే మీర్జాగూడ వద్ద ఎదురుగా అతివేగంతో వస్తున్న కంకర లారీ అదుపు తప్పి బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 18 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అయితే, ప్రమాదం ధాటికి లారీలోని కంకర అంతా బస్సులో ఉన్న ప్రయాణికులపై పడిపోవడంతో వారు ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం.
స్థానికులు, వాహనదారుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్పాట్కు చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అదేవిధంగా క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు నడిరోడ్డుపై లారీ, బస్సు పడిపోవడంతో చేవెళ్ల - వికారాబాద్ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో గత గంట నుంచి వాహనదారులు రోడ్డుపైనే పడిగాపులు కాస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. కాగా, పోలీసులు చేపట్టిన సహాయక చర్యల్లో కూడా అపశృతి చోటుచేసుకుంది. చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ కాళ్లపైకి జేసీబీ ఎక్కింది. దీంతో తీవ్ర గాయాలైన ఆయనను కూడా చికిత్స నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..