
అమరావతి, 4 నవంబర్ (హి.స.)భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 400 కేవీ సబ్స్టేషన్లను ఏర్పాటు చేయాలని శాసనసభ ప్రభుత్వరంగ సంస్థల కమిటీ చైర్మన్ కూన రవికుమార్ విద్యుత్శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం విజయవాడలోని విద్యుత్ సౌధలో పీయూసీ కమిటీ సభ్యులు, ఏపీ ట్రాన్స్కోతోపాటు నెడ్కాప్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ సంస్థల ఆస్తులకు ఎప్పటికప్పుడు మార్కెట్ ధర ప్రకారం విలువ కట్టాలని సూచించారు. తద్వారా ఆస్తుల విలువ ప్రకారం రుణం ఎక్కువగా రావడంతోపాటు వడ్డీ తగ్గుతుందని తెలిపారు. సిబ్బంది నియామకాలు, ఖాళీలతోపాటు, భవిష్యత్తులో నెడ్క్యాప్ ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రాజెక్టుల గురించి కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. సమీక్షలో కమిటీ సభ్యులు గిడ్డి సత్యనారాయణ, వర్ల కుమార్ రాజా, తెనాలి శ్రావణ్ కుమార్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, విద్యుత్ సంస్థల అధికారులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ