
హైదరాబాద్, 4 నవంబర్ (హి.స.)
తెలంగాణ శాసన సభ ప్రాంగణంలో శాసనమండలి భవనం పునర్నిర్మాణ పనులను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు త్వరలోనే శాసన మండలి భవన ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగనుందని తెలిపారు. అనంతరం తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ డా. నరసింహా చార్యులు, ఆర్&బీ, అగాఖాన్ సంస్థ, మరియు తదితర అధికారులతో గుత్తా సుఖేందర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో గుత్తా మాట్లాడుతూ.. రాబోయే సమావేశాలు అసెంబ్లీ పక్కనే ఉన్న ఈ భవనంలోనే నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. శాసన మండలి నూతన సమావేశ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అతి త్వరలోనే నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారని, తాజాగా ఇప్పటివరకు పూర్తయిన పనుల గురించి సీఎం ఆరా తీశారని, ఖచ్చితంగా శాసన మండలి సమావేశాలు కొత్త భవనంలోనే నిర్వహించాలని వారు ఆదేశించారని తెలిపారు. పనులలో ఎలాంటి జాప్యం చేయకుండా, వేగం పెంచాలని, త్వరగా భవనాన్ని పూర్తి చేసి శాసన మండలి అధికారులకు అప్పగించాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..