
శ్రీశైలం, 5 నవంబర్ (హి.స.)కార్తీక పౌర్ణమి (Karthika Pournami) సందర్భంగా శ్రీశైల క్షేత్రం (Srisaila Kshetram) భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం భక్తుల క్యూ లైన్లో ఎదురు చూస్తున్నారు. సూర్యోదయానికి ముందే దేవాలయాల్లో కార్తీక దీపాలను వెలిగించారు. ఓం నమ:శివాయ అంటూ భక్తులు చేస్తున్న శివ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారు మ్రోగుతోంది. శ్రీశైలంలోని వీధులన్ని దర్శనానికి వచ్చిపోయే భక్తులతో సందడిగా మారాయి .
భక్తుల రద్దీ దృష్ట్యా స్పర్శ దర్శనాలు, ఆర్జిత సేవలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈవో ఆదేశాల మేరకు అల్పాహారం, పాలు, బిస్కెట్లు, మంచినీరు పంపిణీ చేస్తున్నారు. పౌర్ణమిని పురస్కరించుకుని సాయంత్రం జ్వాలా తోరణం (Jwala Toranam), రాత్రి 7 గంటలకు లక్ష దీపార్చన, పుష్కరిణి హారతి వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV