
నెల్లూరు , 5 నవంబర్ (హి.స.) సముద్రం పోటు మీద ఉండడంతో రామతీర్థం (Rama Teertham) వద్ద భక్తులను కార్తీక పౌర్ణమి స్నానానికి పోలీసులు అనుమతించడం లేదు. సముద్రం నీటిలో మునగకుండా కేవలం సముద్రం (Sea Bath) నీటిని నెత్తిన చల్లుకొని రావాలని కోరుతున్నారు. ఉదయం నాలుగు గంటల నుంచే మెరైన్ పోలీసులు, రామతీర్థ ఎస్ఐ ఆధ్వర్యంలో బీచ్ వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. అప్పటికే కొందరు మహిళలు సముద్రంలోకి వెళ్లడంతో వారిన పోలీసులు కాపాడారు.
నెల్లూరు నగరానికి 20 కిలో మీటర్ల దూరంలో రామతీర్థం ఉంది. ఈ పుణ్యతీర్థంలో ప్రసిద్ధమైన, పురాతనమైన శ్రీ రామచంద్ర స్వామి ఆలయం (Sri Ramachandra Swamy Temple) కొలువుదీరింది. ఇక్కడి ఆలయంలో వెండి కవచాలలో అలంకరించబడిన రామచంద్ర స్వామి, సీత, లక్ష్మణుల అందమైన విగ్రహాలు దర్శించుకున్న వారిని మంత్ర ముగ్ధులను చేస్తాయి. పురాణాల ప్రకారం.. సీతాదేవిని వెతుకుతున్న సమయంలో శ్రీరాముడు ఈ ప్రదేశంలో ఒక రాత్రి బస చేశాడని చెబుతారు. తెల్లవారుజామున శ్రీరాముడు తన చేతులతో సైకత శివలింగాన్ని రూపుదిద్ది ప్రార్థనలు చేసినట్లు ప్రతీతి. ఈ కారణంగా ఈ ప్రదేశానికి గొప్ప ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV