
అమరావతి, 1 డిసెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు పూర్తిగా పక్కదారి పట్టాయని, ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని ఆమె ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు.
గతంలో 'సోమవారం - పోలవారం' అనే నినాదం ఉండేదని, కానీ ఇప్పుడా 'సోమవారం' సంతకు పోయింది అంటూ శ్యామల ఎద్దేవా చేశారు. ప్రస్తుత ప్రభుత్వం 'మంగళవారం - అప్పుల వారం'గా మార్చేసిందని ఆమె తన పోస్టులో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, ప్రాజెక్టులపై కాకుండా అప్పులు చేయడంపైనే దృష్టి సారించిందని ఆమె ఆరోపించారు.
త్వరలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై కూటమి ఎంపీలు ఎలా స్పందిస్తారో చూడాలని శ్యామల అన్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అంశాలపై వారు పార్లమెంటులో పోరాడతారో లేదో తేలాలని సవాల్ విసిరారు. #failedkutami అంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లను తన ట్వీట్ కు ట్యాగ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV