
అమరావతి, 1 డిసెంబర్ (హి.స.)
తమ రాజీనామాల వ్యవహారంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆరుగురు ఎమ్మెల్సీలు ఏపీ శాసన మండలి ఛైర్మన్ మోషెన్ రాజుకు విజ్ఞప్తి చేశారు.
వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు గతంలో రాజీనామా చేశారు. కానీ వారి రాజీనామాలను మండలి ఛైర్మన్ ఆమోదించకుండా పెండింగ్ లో ఉంచారు. రాజీనామాలను పెండింగ్ లో ఉంచడంపై ఇప్పటికే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు. తన రాజనామా లేఖపై తగిన నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసేలా మండలి ఛైర్మన్ ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. తాజాగా రాజీనామాపై 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఆ ఆర్డర్ కాపీని జయమంగళ.. మండలి ఛైర్మన్ కు అందించారు.
వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచి.. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా కొనసాగలేనని, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనుకుంటున్నా కాబట్టే రాజీనామా ఆమోదించాలని కోరుతున్నట్లు తెలిపారు. మిగతా ఐదుగురు ఎమ్మెల్సీలు పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ్ చక్రవర్తి, జాకియా ఖానం, మర్రి రాజశేఖర్ లు సైతం వైసీపీ నుంచి గెలిచి కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా కొనసాగలేమని తేల్చి చెప్పారు. తమ రాజీనామాలను ఆమోదించాలని కోరారు. రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు ఒక్కొక్కరితో మండలి ఛైర్మన్ మోషేన్ రాజు మాట్లాడి రాజీనామాలకు కారణాలు అడిగి తెలుసుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV