
అమరావతి, 1 డిసెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మరో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిపై ప్రశంసలు కురిపించారు. వివిధ జిల్లాల్లో స్ఫూర్తిదాయకంగా విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులను అభినందిస్తున్న మంత్రి నారా లోకేశ్ తాజాగా విశాఖపట్నం జిల్లా, పెందుర్తి మండలం, పినగాడి మండల ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్న పల్టాసింగి అలివేలి మంగ వినూత్న బోధనా పద్ధతులను ప్రశంసించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా ఒక ప్రకటన చేశారు.
ఆటపాటలతో, ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతున్న తీరు అద్భుతంగా ఉందని లోకేశ్ కొనియాడారు. Learning made easy with Activities అనే విధానంతో పిల్లల్లో చదువు పట్ల ఆమె ఆసక్తిని పెంచుతున్నారని తెలిపారు. ఇటువంటి వినూత్న పద్ధతులు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.
Unique innovative Teaching methods, No Bag Day Activities, Word Building, FLN Based Learning వంటి అంశాలను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధిస్తూ, వాటిని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్న ఉపాధ్యాయురాలు అలివేలి మంగ కృషి ప్రశంసనీయమని లోకేశ్ పేర్కొన్నారు. ఆమెకు తన అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం లోకేశ్ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV