
అమరావతి, 11 డిసెంబర్ (హి.స.) వ్యవసాయానికి అవసరమైన ఆధునిక సాగు యంత్ర పరికరాల కోసం వ్యవసాయ పరికరాల బ్యాంక్ (అగ్రికల్చర్ ఎక్వి్పమెంట్ బ్యాంక్)ను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సాగు వ్యయం తగ్గేలా ఆధునిక యంత్ర పరికరాలను రైతులకు అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ధాన్యం, పత్తి, మిర్చి సహా వాణిజ్య పంటల కొనుగోళ్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రత్యేకంగా వెబ్సైట్ను ప్రారంభించి, వ్యవసాయ పరికరాల సమాచారం అందుబాటులో ఉంచాలని సూచించారు. 2025-26లో 50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు.
2,606 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరిస్తున్నామని, 7.39 కోట్ల గోనె సంచులు రైతులకు అందుబాటులో ఉంచామని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపే రైతులకు డబ్బు చెల్లిస్తున్నామని వివరించారు. స్పందించిన సీఎం.. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు చూసుకోవాలని, ప్రజాప్రతినిధులంతా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, రైతులకు అండగా నిలబడాలని సూచించారు. పంట ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్ కల్పించడంపైనా దృష్టి పెట్టాలన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా రాగులు, జొన్నలు, సజ్జల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. చిరుధాన్యాల పంటలను అందుబాటులో ఉంచాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ