
అమరావతి, 11 డిసెంబర్ (హి.స.)ప్రభుత్వ పరిపాలన మొత్తం జనవరి 15లోగా ఆన్లైన్ కావలసిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు డెడ్లైన్. విధించారు. రాబోయే మూడు నెలల్లో ప్రజల్లో సంతృప్తి స్థాయి 80 శాతానికి చేరుకోవాలని టార్గెట్ పెట్టారు. ‘రాజ్యాంగాన్నే అనేక సార్లు సవరించుకున్నాం. పరిపాలనలో బిజినెస్ రూల్స్ ఎందుకు సవరించకూడదు? కొందరు అధికారులు ఫైళ్లు త్వరగా పరిష్కరించడం లేదు. పైగా ఉన్న ఫైళ్లనే కిందకూ పైకీ తిప్పుతూ కొత్త ఫైళ్లు సృష్టిస్తున్నారు. అందుకే బిజినెస్ రూల్స్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం కమిటీని నియమించి సవరణలు చేద్దాం’ అని చెప్పారు. ఫైళ్ల క్లియరెన్సు, ప్రభుత్వ శాఖల పనితీరుపై పాజిటివ్ రేటు, డేటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్పై బుధవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో ఆయన కీలక సమీక్షలు జరిపారు.
ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్ మంత్రులు, సెక్రటరీలు, కలెక్టర్లు, హెచ్వోడీల ఫైళ్ల క్లియరెన్స్ డేటా మొత్తాన్ని ఆయన ముందుంచారు. దానిని పరిశీలించిన చంద్రబాబు.. వారందరికీ క్లాసు తీసుకున్నారు. రోజుల తరబడి ఫైళ్లు పెండింగ్ పెట్టడం ఏమిటని నిలదీశారు. రాష్ట్ర స్థాయిలోనేగాక జిల్లా స్థాయిలోనూ ఎక్కడా మాన్యువల్ ఫైళ్లు ఉండకూడదని, జిల్లాల్లో ఈ-ఆఫీస్ ఫైల్స్ మాత్రమే ఉపయోగించాలని స్పష్టంచేశారు. జనవరి 15లోగా ఆన్లైన్ చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. విజిలెన్స్ కేసులు ఉపసంహరించాలని వచ్చిన విన్నపాలకు సంబంధించిన ఈ-ఆఫీస్ ఫైళ్ల క్లియరెన్స్లో సమస్యలు వస్తున్నాయని భాస్కర్ తెలిపారు. మంత్రులు రాంప్రసాద్రెడ్డి(రవాణా), కొల్లు రవీంద్ర(ఎక్సైజ్, గనులు), నాదెండ్ల మనోహర్ (పౌరసరఫరాలు)కు సంబంధించిన ఈ-ఆఫీస్ లాగిన్లో విజిలెన్స్ కేసుల ఫైళ్లు ఎక్కువగా ఉంటున్నాయని.. అలాగే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వద్ద డబ్బులకు సంబంధించిన ఫైళ్లు అధికంగా పెండింగ్లో ఉన్నాయని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ