
అమరావతి, 11 డిసెంబర్ (హి.స.): ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో 44 అజెండా అంశాలకు ఆమోదం తెలిపారు. సమావేశం ముగిసిన తర్వాత కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించి దాదాపు రూ.9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో లోక్భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ కార్యాలయం, రెండు గెస్ట్ హౌస్లు, స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణానికి మంత్రివర్గం అంగీకారం లభించింది.
సీడ్ యాక్సిస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధానించే పనులకు రూ.532కోట్ల మేర టెండర్లు పిలిచేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కుప్పంలో పాలేరు నదిపై చెక్ డ్యాంల నిర్వహణకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ ముసాయిదా బిల్లుపై కేబినెట్లో చర్చించారు. ఎస్ఐపీబీలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రపెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో 26సంస్థల ఏర్పాటుకు సంబంధించి ఆమోదం తెలిపిన దాదాపు రూ.20,444 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. వీటి ద్వారా 56వేల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరుగనుందని మంత్రి పార్థసారథి తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ