
హైదరాబాద్, 15 డిసెంబర్ (హి.స.)
నగరంలోని హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆర్టీసీ కాలనీ సమీపంలో రోడ్డు దాటుతున్న సమయంలో అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఎంబీబీఎస్ విద్యార్థిని ఐశ్వర్య అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె తండ్రి పాండు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఐశ్వర్యను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తండ్రి పాండు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన హయత్నగర్ పోలీసులు, కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..