
అమరావతి, 17 డిసెంబర్ (హి.స.)
రాష్ట్ర అభివృద్ధిలో జిల్లా కలెక్టర్ల పాత్ర ఎంతో కీలకమని, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వారు చూపుతున్న చొరవ అభినందనీయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో (Collectors Conference) ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా సాధించిన ప్రగతిని వివరిస్తూ.. సుమారు 4 వేల కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేశామని వెల్లడించారు. అలాగే నీటి సంరక్షణలో భాగంగా లక్ష్యానికి అనుగుణంగా 1.20 లక్షల ఫాం పాండ్స్ (పంటకుంటలు) తవ్వడం జరిగిందని తెలిపారు. ఉపాధి హామీ పథకం (నరేగా) ద్వారా సుమారు 4,330 కోట్ల రూపాయలను వేతనాల రూపంలో నేరుగా లబ్ధిదారులకు చెల్లించామని అన్నారు. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఊతమిచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV