
ఖమ్మం, 2 డిసెంబర్ (హి.స.)
నివాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం నగరంలోని ముస్తఫానగర్లో కొత్తగా ఏర్పాటు చేసిన వైన్ షాపు ఎదుట స్థానికులు ఆందోళనకు దిగారు. ఇండ్ల మధ్య మద్యం దుకాణం వద్దంటూ పెద్దపెట్టున నినదించారు. ఇటీవల అధికారులు మద్యం దుకాణాలను లాటరీ ద్వారా కేటాయించగా.. ముస్తఫానగర్ ప్రాంతంలో దుకాణం దక్కించుకున్న వ్యాపారులు దుకాణం నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిరసన కారులు మాట్లాడుతూ నివాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయడం సరికాదని, వెంటనే మరో ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో చర్చించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చే స్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు