
అమరావతి, 23 డిసెంబర్ (హి.స.)ఎలక్ట్రానిక్ వస్తువులను తయారు చేసే పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ పాలసీ 2025-30ను ఐటీశాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ సోమవారం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఈ పాలసీకి సంబంధించిన మార్గదర్శకాలను ఈ ఏడాది ఏప్రిల్ 26న ఐటీశాఖ విడుదల చేసింది. ఎర్లీబర్డ్ పథకం కింద రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడి పెట్టిన తొలి పది కంపెనీలకు 50 శాతం పెట్టుబడి రాయితీని రెండు వాయిదాల్లో ఇస్తారు. ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ ఎర్లీబర్డ్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే క్యాపిటల్ సబ్సిడీని లేదా కేంద్రం అందించే 100శాతం మ్యాచింగ్ గ్రాంట్ను తీసుకోవచ్చని రాష్ట్ర ఐటీ శాఖ వెల్లడించింది. ఫ్యాక్టరీ భవనాలకు మూడేళ్లపాటు అద్దెలో 50 శాతం రాయితీని ప్రభుత్వం భరిస్తుంది.
ఎలక్ట్రిసిటీ డ్యూటీని ఆరేళ్లపాటు పూర్తిగా రద్దు చేస్తారు. రూ. 1,000 కోట్లు దాటి పెట్టుబడులు పెట్టిన సంస్థలకు పాలసీ మేరకు ఐదేళ్లపాటు టైలర్మేడ్ విధానంలో సబ్సిడీలను అందిస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ