
విశాఖపట్నం: , 31 డిసెంబర్ (హి.స.)
విశాఖపట్నం: కైలాసగిరిపై ఇటీవల ప్రారంభించిన తేలియాడే గాజు వంతెన వద్దకు సందర్శకులు పోటెత్తుతున్నారు. క్రిస్మస్ నుంచి వరస సెలవులు రావడంతో ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు నగరానికి తరలివస్తున్నారు. కైలాసగిరికి వచ్చిన వారిలో అధికశాతం గాజు వంతెన ఎక్కేందుకు క్యూ కడుతున్నారు. రూ.250 వసూలు చేస్తున్నా కొత్త అనుభూతి కోసం ముందుకు వస్తున్నారు. భద్రత దృష్ట్యా దీనిపైకి ఒకసారి 25 నుంచి 30 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. వెళ్లిన వారు 10నిమిషాలు అక్కడ ఉండి తీర అందాలు వీక్షించడానికి అవకాశం కల్పిస్తున్నారు. గంటకు 100 మంది వరకే అవకాశం ఉంటోంది. ప్రారంభంలో బాగానే ఉన్నా.. ఇప్పుడు రాజకీయ నాయకులు, వీఎంఆర్డీఏ అధికారుల సిఫార్సు లేఖలు, రూ.1000 వీఐపీ టికెట్ల ఉన్న వారిని ముందుగా పంపిస్తుండడంతో మిగతా వారు రెండు, మూడు గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. అలా కాకుండా వీఐపీలను కొంత మందిని, రూ.250టికెట్లు ఉన్న వారిని కొంత మందిని విడతల వారీగా పంపిస్తే గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గాజువంతెన నిర్వహణను నిర్వాహకులపై వదిలేయకుండా వీఎంఆర్డీఏ అధికారులు కూడా పర్యవేక్షించి సందర్శకులకు అసౌకర్యం లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ