
చర్లపల్లి,, 5 డిసెంబర్ (హి.స.)
చర్లపల్లి పారిశ్రామికవాడలో గురువారం సాయంత్రం ‘కర్నూలు బస్సు ప్రమాదాన్ని’ తలపించేలా రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం.. డీసీఎంను తప్పించబోయి వెనుక టైర్ల కింద ఇరుక్కుంది. ఈ క్రమంలో పెట్రోల్ లీకై మంటలు చెలరేగాయి. క్షణాల్లో డీసీఎం, బైకు కాలిపోయాయి. స్థానికుల వివరాల ప్రకారం.. ఘటన జరిగిన సమయంలో డీసీఎంలో దాదాపు పది మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ఉన్నారు. వారంతా హకీంపేట నుంచి చర్లపల్లి రైల్వేస్టేషన్కు వెళ్తున్నారు.
గురువారం సాయంత్రం సుమారు 6.30 గంటలకు డీసీఎం చర్లపల్లి విద్యుత్ సబ్స్టేషన్కు చేరుకోగానే.. వెనక వస్తున్న ద్విచక్రవాహనదారుడు డీసీఎంను తప్పించబోయాడు. ఎదురుగా మరో వాహనం రావడంతో మధ్యలో ఇరుక్కుపోయి.. టైర్ల కిందపడిపోయాడు. కొద్దిదూరం ఈడ్చుకుంటూ వెళ్లడంతో డీసీఎంతోపాటు బైకు ట్యాంకులోంచి పెట్రోల్ లీకై.. మంటలు వ్యాప్తించాయి. గమనించిన జవాన్లు వెంటనే కిందికి దిగారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. బైకు నడుపుతున్న వ్యక్తికి గాయాలు కాగా.. వెనక కూర్చున్న మరో వ్యక్తి సురక్షితంగా బయటపడి పారిపోయాడు. ఘటనకు కారణమైన వ్యక్తి బిహార్కు చెందిన కరణ్కుమార్ పాశ్వాన్గా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. చర్లపల్లి సీఐ సుధాకర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ