
పెందుర్తి, 7 డిసెంబర్ (హి.స.)సహజీవనం చేస్తున్న మహిళ హత్యకు గురైన ఘటన పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా.. చినముషిడివాడ సమీప లక్ష్మీనగర్ కాలనీకి చెందిన వనుము శ్రీనివాసరావు (43)కు విజయనగరం జిల్లా రాజీవ్నగర్ కాలనీకి చెందిన అల్లా దేవి (34) అనే మహిళతో పరిచయం ఉంది. నెల రోజుల క్రితం వారిద్దరూ భార్యాభర్తలమని చెప్పుకొంటూ పాత గోశాల సమీపంలోని ఓ ఇంటిలో అద్దెకు దిగారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం సుమారు 12గంటల సమయంలో వారు నివాసం ఉంటున్న ఫ్లాటులో అరుపులు వినిపించగా మహిళా కాపలాదారు అక్కడికి వెళ్లింది. కుటుంబ కలహాలు నీకెందుకని శ్రీనివాసరావు అనడంతో ఆమె వెనుదిరిగింది. తర్వాత అతడు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తన ఫ్లాట్కు తాళం వేసి బయటకు వెళ్లిపోయాడు. వాచ్మెన్ అపార్టుమెంటులోని ఇతర నివాసితులకు ఈ విషయం చేరవేయగా వారు పోలీసులకు సమాచారం అందించారు. వారు బలవంతంగా ఇంటి తలుపులు తెరిచి చూడగా దేవి రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గుర్తించారు. హుటాహుటిన కేజీహెచ్కు తరలించగా రాత్రి మరణించింది. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. నిందితుడు ఇనుప కుర్చీతో ఆమెపై దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
శ్రీనివాసరావుపై ఆరిలోవ స్టేషన్లో మోసం కేసు ఉన్నట్లు సమాచారం. అతడు ఆమెపై ఎందుకు దాడి చేశాడన్న విషయంలో స్పష్టత రాలేదు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అతడు తరచూ దేవి వద్దకు కారులో వచ్చేవాడు. కారు దిగిన తర్వాత హెల్మెట్ పెట్టుకునే ఇంట్లోకి రాకపోకలు చేసేవాడని ఇతర నివాసితులు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ