
కడప, 7 డిసెంబర్ (హి.స.)
: కడప నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక కోసం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదితి సింగ్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 11న ఉదయం 11 గంటలకు కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ రెండు రోజుల కిందటే కడప మేయర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో.. ఇవాళ జాయింట్ కలెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చారు.
ఇటీవలే వైకాపా నేత సురేష్ బాబును మేయర్ పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేష్ బాబును పదవి నుంచి తొలగించింది. డిప్యూటీ మేయర్గా ఉన్న ముంతాజ్ బేగంను నియమించారు. అయితే, మరో 5 నెలల్లో పాలకవర్గం పదవీకాలం గడువు ముగుస్తున్న నేపథ్యంలో నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయటానికి తీర్మానాలు తప్పనిసరి అని భావించిన నేపథ్యంలో మేయర్ ఎన్నిక అనివార్యమైంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్.. మేయర్ పదవి కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే.. ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ పై సురేష్ బాబు హైకోర్టులో శుక్రవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన వేసిన పిటిషన్ పైన ఈనెల 9న హైకోర్టు విచారణ జరపనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ