
భీమవరం, 7 డిసెంబర్ (హి.స.)
: నరసాపురం నుంచి చెన్నైకు వందేభారత్ ఎక్స్ప్రెస్ సేవలు ఈ నెల 15 నుంచి అందుబాటులోకి వస్తాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. భీమవరంలోని భాజపా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పల్లెలకు తాగునీరు..జిల్లాలో జల జీవన్ మిషన్ ద్వారా రూ.1400 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ ఇంటికి తాగునీరు అందిస్తాం. 3.19 లక్షల గృహాలకు స్వచ్ఛమైన నీరు అందుతుంది.
జాతీయ రహదారి పనులు.. ఆకివీడు- దిగమర్రు, భీమవరం బైపాస్తో కలిపి ఎన్హెచ్ 165కు సర్వే, డీపీఆర్, టెక్నికల్ సమస్యలు పరిష్కారం, ఇతర అనుమతులు సాధించాం. ఈ ప్రాజెక్టుకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రాగానే జనవరి నెలాఖరు నాటికి పనులు ప్రారంభించేలా టెండరు పిలుస్తాం.
నేడు భూమిపూజ..భీమవరం, ఆచంటలో డయాలసిస్ కేంద్రాలకు ఆదివారం భూమిపూజ చేస్తున్నాం. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అత్యాధునిక డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.ఇందుకు రూ.10 కోట్ల సీఎస్ఆర్ నిధులు వెచ్చిస్తున్నాం. తొలిదశలో భీమవరం ప్రాంతీయ ఆసుపత్రి దగ్గర రూ.2 కోట్లతో ఎనిమిది పడకలతో, ఆచంటలో సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద రూ.కోటితో మూడు పడకలతో కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం.
క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ వ్యాను..ప్రజా ఆరోగ్య సంరక్షణలో భాగంగా రూ.4 కోట్ల వ్యయంతో క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ యూనిట్ వ్యానును జిల్లావాసులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నా. ప్రతి మారుమూల ప్రాంతాలకు ఈ వ్యాను వెళ్లి అక్కడే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ