తెలంగాణ, రంగారెడ్డి. 28 జూలై (హి.స.) రంగారెడ్డి జిల్లా
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇంటిని ఫార్మా బాధిత రైతులు సోమవారం ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ముట్టడించారు. యాచారం మండలంలోని మేటిపల్లి నానక్ నగర్ తాటిపర్తి కురుమిద్ద గ్రామాలకు చెందిన ఫార్మా బాధిత రైతులు సోమవారం ఉదయం కృయిజర్లు, ట్రాక్టర్లు కట్టుకొని తిరుమలహిల్స్లోని ఎమ్మెల్యే రంగారెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. రంగారెడ్డి ఇంటి ముందు సుమారు 300 మంది రైతులు, మహిళలు, యువకులు బైఠాయించి ప్లకార్డులను ప్రదర్శించి నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి, ఎమ్మెల్యే రంగారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చే వరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ రైతులు భీష్మించి కూర్చున్నారు.
ఈ సందర్భంగా ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని ఫార్మా బాధిత రైతులకు భూములను తిరిగి ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్న నేటికీ హామీ నెరవేర్చక పోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు