ఢిల్లీ , 11 ఆగస్టు (హి.స.)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరిపై నిర్మించ తలపెట్టిన బనకచర్ల (Banakacharla)పై బీఆర్ఎస్ (BRS) రాజ్యసభలో పోరాటానికి సిద్ధమైంది. ఈ మేరకు ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ కే.సురేశ్ రెడ్డి (K Suresh Reddy) ఇవాళ ఏపీ సర్కార్ అనధికారికంగా ఉపయోగిస్తున్న గోదావరి నదీ జలాల అంశం, బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాలని ఇవాళ రాజ్యసభలో వాయిదా తీర్మానం అందజేశారు. కనీస అనుమతులు లేకుండా సీఎం చంద్రబాబు ప్రభుత్వం నిర్మించే బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project)ను అడ్డుకోవాలని అందులో పేర్కొన్నారు. సభలో ప్రశ్నోత్తరాలను వాయిదా వేసి బనకచర్ల అంశంపై చర్చించాలని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్కు బీఆర్ఎస్ ఎంపీలు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సురేశ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి లైఫ్లైన్ గోదావరి అని అన్నారు. ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచర్లపై తమకు చాలా అనుమానాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలను ఏపీ దెబ్బతీస్తోందని ఆరోపించారు. రాష్ట్రం వీడిపోయాక పదేళ్ల పాటు అన్నదమ్ముల కలిసి ఉన్నామని, కానీ తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహపూరిత వాతావరణం దెబ్బతినేలా బనకచర్లపై ఏపీ ప్రభుత్వం రోజుకో ప్రకటన చేస్తోందని ఫైర్ అయ్యారు. సముద్రంలో కలిసే నీళ్లు తీసుకుంటున్నామని ఏపీ చెబుతోందని.. అసలు రెండు రాష్ట్రాల వాటా ఎంతో తేలాలని అన్నారు. ఆ తర్వాతే మిగులు జలాలపై చర్చ జరగాలన్నారు. గోదావరి నీటిపై కేంద్ర ప్రభుత్వంతో పాటు జలశక్తి క్లారిటీ ఇవ్వాలని సురేశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి