అమరావతి, 11 ఆగస్టు (హి.స.)
: మధ్యప్రదేశ్ లో భారీ చోరీ జరిగింది. ఓ బ్యాంకులోకి చొరబడిన నిందితులు.. 10 కిలోల బంగారం, రూ.5 లక్షల నగదుతో పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జబల్పుర్ జిల్లా ఖితోలాలోని ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులోకి సోమవారం ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు హెల్మెట్లు ధరించి ప్రవేశించారు. అక్కడున్న సిబ్బందిని బెదిరించి.. దాదాపు రూ.10 కోట్ల విలువ చేసే 10 కిలోల బంగారం, రూ.5 లక్షల నగదుతో ఉడాయించారు.
‘‘నిందితులు రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చారు. కేవలం 18 నిమిషాల్లోనే చోరీ చేసి పరారయ్యారు. ఆ సమయంలో బ్యాంకులో ఆరుగురు సిబ్బంది ఉన్నారు. బ్యాంకుకు సెక్యూరిటీ గార్డు కూడా లేడు. సీసీటీవీ ఫుటేజీలను తనిఖీ చేశాం. వారి చేతిలో ఆయుధాలేమీ లేవు. అయితే.. దొంగతనం జరిగిన 45 నిమిషాల తర్వాత సిబ్బంది మాకు సమాచారం అందించారు. సకాలంలో అప్రమత్తం చేసి ఉంటే.. నిందితులు దొరికేవారు. వారిని పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ