హైదరాబాద్, 12 ఆగస్టు (హి.స.)
: తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్తో పాటు జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్న నేపథ్యంలో బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో 6.6, గుడిపల్లి మండలంలో 6.5, రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తాళ్లపల్లిలో 6.4 సెం.మీ. వర్షం కురిసింది. సంగారెడ్డి, వికారాబాద్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, జనగామ, వరంగల్, నిర్మల్, కరీంనగర్ జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ