న్యూఢిల్లీ:15 ఆగస్టు (హి.స.) ముష్కరమూకల స్థావరాలను నేలమట్టంచేసి భారత సైనిక సత్తాను చాటిన ఆపరేషన్ సిందూర్ను విజయవంతంగా అమలుచేసిన తొమ్మిది మంది వాయుసేన పైలెట్లకు భారత ప్రభుత్వం వీర్చక్ర పురస్కారం ప్రకటించింది. సర్వసైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పలువురికి గ్యాలంట్రీ అవార్డ్లను ప్రకటించారు. యుద్ధకాలంలో ఇచ్చే మూడో అత్యున్నత గ్యాలంట్రీ అవార్డ్ అయిన వీర్చక్రను వాయుసేనకు చెందిన తొమ్మిది మంది పైలెట్లకు ప్రకటించారు.
గ్రూప్ కెప్టెన్లు రంజిత్ సింగ్ సిధూ, మనీశ్ అరోరా, అనిమేశ్ పట్నీ, కునాల్ కల్రాలకు వీర్చక్ర ప్రకటించారు. వింగ్ కమాండర్ జోయ్ చంద్ర, స్వాడ్రాన్ లీడర్లు సర్థాక్ కుమార్, సిద్ధాంత్ సింగ్, రిజ్వాన్ మాలిక్, ఫ్లయిట్ లెఫ్టినెంట్ ఏఎస్ ఠాకూర్లకూ వీర్చక్ర ప్రకటించారు. ఆర్మీ తరఫున కల్నల్ కోశాంగ్ లాంబా, లెఫ్టినెంట్ కల్నల్ సుశీల్ బిష్ట్, నాయిబ్ సుబేదార్ సతీశ్ కుమార్, రైఫిల్మ్యాన్ సునీల్ కుమార్లకూ వీర్చక్ర దక్కింది. యుద్ధకాల గ్యాలంట్రీ అవార్డుల్లో పరమ్ వీర్చక్ర, మహావీర్ చక్ర తర్వాత వీర్చక్రను మూడో అత్యున్నత అవార్డ్గా పరిగణిస్తారు.
గ్యాలంట్రీ అవార్డ్ల జాబితాను గురువారం మోదీ ప్రభుత్వం విడుదలచేసింది
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ