దిల్లీ: 15 ఆగస్టు (హి.స.)
జ్యుడీషియల్ సర్వీసు పరీక్షలు రాయాలని కోరుకునే న్యాయ పట్టభద్రులు కనీసం మూడేళ్ల పాటు ఏదైనా న్యాయస్థానంలో ప్రాక్టీసు చేసి ఉండాలంటూ తాను వెలువరించిన తీర్పును సవరించేందుకు సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. ఈ తీర్పును మార్చడం అనేక సమస్యలకు దారి తీస్తుందని అభిప్రాయపడింది. ప్రస్తుతం సర్వీసులో ఉన్న జడ్జీలు కూడా ఈ పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతించాలంటూ మధ్యప్రదేశ్కు చెందిన ఒక జడ్జి దాఖలు చేసిన పిటిషన్పై విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తాజాగా విద్యాభ్యాసం పూర్తిచేసిన న్యాయ శాస్త్ర పట్టభద్రులు ప్రారంభ స్థాయి జ్యుడీషియల్ సర్వీసు పరీక్షకు హాజరు కావడాన్ని నిషేధించడంతోపాటు మూడేళ్లు న్యాయవాదిగా అనుభవం గడించిన వారే ఈ పరీక్షకు హాజరు అయ్యేందుకు అర్హులని గత మే నెలలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. లా ఇంటర్న్లుగా పనిచేసిన వారి అనుభవాన్నీ పరిగణనలోకి తీసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ