హైదరాబాద్, 16 ఆగస్టు (హి.స.)
నేషనల్ హైవే, నేషనల్ ఎక్స్ప్రెస్వేపై
ప్రయాణించే వాణిజ్యేతర వాహనదారుల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వార్షిక టోల్ పాసు ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీని ద్వారా ప్రయాణికులకు ఖర్చు తగ్గించటంతో పాటు టోల్ చెల్లింపుల వ్యవస్థ మరింత సౌకర్యవంతంగా మారనుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాసు అమల్లోకి వచ్చింది. అయితే, కేవలం వైట్ నంబర్ ప్లేట్ వెహికల్స్కు మాత్రమే ఈ యాన్యువల్ పాస్ వర్తిస్తుంది. ఇక రూ.3000 చెల్లించి రాజ్మార్గ్ యాత్ర యాప్ ద్వారా ఈ పాస్ను యాక్టివేట్ చేసుకోవచ్చు. దీంతో ఏడాది పాటు లేదా 200 టోల్ గేట్ల వరకు ఎలాంటి అడ్డంకులు లేకుండా జాతీయ రహదారులపై ప్రయాణించవచ్చు. ఇక ఎన్హెచ్ఎఐ ప్రవేశపెట్టిన ఈ వార్షిక ఫాస్టాగ్కు తొలి రోజే భారీ స్పందన లభించింది. కేవలం ఒక్క రోజులోనే 1.4 లక్షల మంది వినియోగదారులు ఈ ప్యాకేజీని కొనుగోలు చేయగా, 1.39 లక్షల లావాదేవీలు నమోదయినట్లు కేంద్ర రవాణా శాఖ తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..