అమరావతి, 4 ఆగస్టు (హి.స.)రాష్ట్రంలో అడవి ఏనుగుల దాడులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఊరట లభించింది. అడవి ఏనుగులు పంట పొలాల పై దాడి చేసినప్పుడు, వాటిని తరిమికొట్టడానికి కుంకీ ఏనుగులను ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కుంకీ ఏనుగులు పూర్తైంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పగించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. తొలి విడతగా నాలుగు కుంకీ ఏనుగులను అప్పగించారు. ఈ క్రమంలో దేవా, కృష్ణ, అభిమన్యు, మహేంద్ర అనే నాలుగు కుంకీ ఏనుగులను ఏపీకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
ఈ తరుణంలో చిత్తూరు జిల్లా పలమనేరు అడవి ప్రాంతంలో కుంకీ ఏనుగులు గస్తీ కాశాయి. ఎనిమిది అడవి ఏనుగుల గుంపు టేకు మంద ప్రాంతంలో తిరుగుతున్నట్లు సమాచారం రావడంతో కృష్ణ, జయంత్, వినాయక్ అనే కుంకీలను శిక్షకులు ఆ వైపు తీసుకెళ్లారు. పంటల వైపు రాకుండా అడవి ఏనుగులను కుంకీలు మళ్లించాయి. అడవి నుంచి వచ్చిన గుంపులో ఓ గున్న ఏనుగు ఉండటంతో వాటిని మళ్లించడం కాస్త కష్టమైందని పలమనేరు DFO వేణుగోపాల్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి