తెలంగాణ, నల్గొండ. 5 ఆగస్టు (హి.స.)
నేర నియంత్రణ చర్యల్లో భాగంగా కమ్యూనిటీ కాంటాక్ట్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. శాంతి భద్రతలు కల్పించడంతోపాటు మాదకద్రవ్యాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మంగళవారం తెల్లవారుజామున నకిరేకల్ పట్టణంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సోదాలలో సరైన పత్రాలు లేని మొత్తం 130 వాహనాలు పట్టుబడ్డాయి. వీటిలో 120 ద్విచక్ర వాహనాలు,10 త్రీ చక్ర వాహనాల ఉన్నాయి. ఎనిమిది మంది అనుమానితులను గుర్తించారు. నల్లగొండ డీఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐదుగురు సీఐలు, 20 మంది ఎస్ఐలు, 50 మంది టీజీఎస్పీ సిబ్బందితో కలిపి మొత్తం 300 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
అనంతరం ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ.. నేపాల్ నుంచి వచ్చిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఒక షెడ్లో అక్రమంగా ఉంచిన 15 ఆవు దూడలు పట్టుబడ్డాయని, చట్టప్రకారం గోశాలకు తరలించడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా 18 మంది గంజాయి సేవించినట్లు గుర్తించామని, వారికి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు