న్యూఢిల్లీ, 5 ఆగస్టు (హి.స.)
తెలంగాణ స్థానికత కోటా వ్యవహారంపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. పదో తరగతి తర్వాత రెండేళ్లు బయట ఉంటే స్థానికత వర్తించదన్న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులపై పలువురు విద్యార్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నియమ నిబంధనలు రూపొందించాలని, విద్యార్థుల పిటిషన్పై విచారణ జరిపి తీర్పు ఇచ్చింది. పరిమితులపై మార్గదర్శకాలు జారీ చేయాలని హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో హైకోర్టు తీర్పును విద్యార్థులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. రెండేళ్లు బయట ప్రాంతాల్లో చదువుకోవడానికి వెళ్తే తప్పేంటని విచారణలో సీజేఐ ప్రశ్నించారు. పదేళ్లు స్థానికంగా ఉండి.. రెండేళ్లు బయటికెళ్తే స్తానికత ఎలా కోల్పోతారు? అని సీజేఐ ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులు స్థానిక కోటా కిందకు రారని, నాలుగు ఏళ్లు చదువు లేదా నివాసం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానికత ఖరారు చేసిందని ప్రభుత్వ తరఫు న్యాయవాది వివరించారు. స్థానికత నిబంధనల కారణంగా విద్యార్థులకు హక్కులకు అన్యాయం జరగకూడదని సీజేఐ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక, స్థానికతపై రెండున్నర గంటల పాటు జరిగిన విచారణ అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..