తిరుమల6 ఆగస్టు (హి.స.) తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రానికి అనుబంధంగా విశాలమైన మరొక భవనాన్ని నిర్మించాలని టీటీడీ భావిస్తోంది
. ప్రస్తుతం ఒకేసారి 4 వేల మంది భోజనం చేసేలా నాలుగు డైనింగ్ హాళ్లు అన్నప్రసాద కేంద్రంలో ఉన్నాయి. రోజుకు 70 నుంచి 75 వేల మంది ఇక్కడ భోజనం చేస్తుంటారు. రద్దీ రోజుల్లో ఈ సంఖ్య లక్ష దాటుతుంది. ఇటువంటి సమయాల్లో ఈ కేంద్రం వద్ద భారీగా క్యూ లైన్లు ఉంటున్నాయి. దీంతో వెయ్యి మంది ఒకేసారి భోజనం చేసేలా మరొక హాలు అవసరమని టీటీడీ అధికారులు అంచనా వేశారు. వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రానికి సమీపంలోని గ్యాస్ ప్లాంట్ను గోగర్భం డ్యాం వద్దకు తరలిస్తున్నందున, ఈ ప్రదేశంలో కొత్త భవనం నిర్మించాలని నిర్ణయించినట్టు తెలిసింది. టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, అన్నప్రసాద విభాగం అధికారులతో కలిసి సోమవారం ఆ ప్రదేశాన్ని పరిశీలించారు.
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ