దిల్లీ:, 9 ఆగస్టు (హి.స.) దేశ రాజధాని దిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న కుంభవృష్టితో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. శనివారం కూడా భారీ వర్షాలు (Heavy Rains in Delhi) కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ (Red Alert for Delhi) జారీ చేసింది. మరోవైపు వర్షాల నేపథ్యంలో విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. 200లకు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి.
వర్షం (Delhi Rains) కారణంగా కన్నౌట్ ప్యాలెస్, మథుర రోడ్డు, భారత్ మండపం తదితర ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే దాదాపు 210 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో దిల్లీ ఎయిర్పోర్టు అడ్వైజరీ జారీ చేసింది. విమాన సర్వీసులకు సంబంధించి ప్రయాణికులు ఎప్పటికప్పుడు తమ తమ ఎయిర్లైన్ల నుంచి తాజా సమాచారం తెలుసుకోవాలని సూచించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ