తెలంగాణ, మెదక్. 1 సెప్టెంబర్ (హి.స.)
రాష్ట్రంలో యూరియా కోసం రైతుల
ఆందోళనలు కొనసాగుతున్నవి. మెదక్ జిల్లా తూప్రాన్ లో సోమవారం జాతీయ రహదారిపై రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించి వాహనాలను అడ్డుకున్నారు. ఉమ్మడి తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో రైతులు రైతు వేదికల వద్ద యూరియా గురించి అధికారులను నిలదీశారు. ఇంకా ఎన్ని రోజులు కాలయాపన చేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. ఇటు మనోహరాబాద్ మండల కేంద్రంలో జాతీయ రహదారి ఎన్ హెచ్ 44 పై అడ్డుగా కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రైతులకు నచ్చ చెప్పగా నేడు యూరియా సరఫరా కాకపోతే ఊరుకోమని తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు