అమరావతి, 11 సెప్టెంబర్ (హి.స.)
, అమరావతి: స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి సరదాగా విహారయాత్రకు కొందరు, దైవ దర్శనాలకు మరికొందరు, ఉద్యోగ, ఉపాధి, వ్యాపార నిమిత్తం ఇంకొందరు... మన రాష్ట్రం నుంచి నేపాల్ వెళ్లారు. ఆ దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల కారణంగా బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. కొద్దిరోజులుగా నేపాల్లో సాగుతున్న అల్లర్లకు ఎక్కడ ఉండాలో తెలియక మనవారు రహదారుల వెంబడి పరుగులు పెట్టారు. ఆందోళనకారుల దాడులకు భయపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కొంతమంది బస్టాండ్లు, ఆలయాల్లో తలదాచుకున్నారు. దైవ దర్శనానికి వెళ్లి తిరిగొచ్చేలోపే తాము ఉన్న హోటల్ కాలిపోయి పాస్పోర్టులు, దుస్తులు, డబ్బు, బంగారం పోగొట్టుకున్న వారూ ఉన్నారు. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు జిల్లాల వాసులు 217 మంది నేపాల్లో చిక్కుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ