అమరావతి, 11 సెప్టెంబర్ (హి.స.)
అమరావతి: నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై మంత్రి నారా లోకేశ్ ( రెండో రోజు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి సహచర మంత్రులు వంగలపూడి అనిత, కందుల దుర్గేష్తో కలిసి అధికారులతో వివిధ అంశాలపై చర్చించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని లోకేశ్ ఆదేశించారు.
ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం ఇప్పటికే కాఠ్మాండూ చేరుకుంది. ఆ విమానం మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నం.. ఆ తర్వాత తిరుపతి విమానాశ్రయానికి రానుంది. అందుబాటులో ఉన్న కూటమి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయా విమానాశ్రయాలకు వెళ్లి రాష్ట్ర వాసులకు స్వాగతం పలకాలని మంత్రి లోకేశ్ సూచించారు. విశాఖ, తిరుపతి చేరుకున్న యాత్రికులను వారి స్వస్థలాలకు చేర్చే బాధ్యతను కూటమి ఎమ్మెల్యేలకు అప్పగించారు. వాహనాలు, ఇతర సదుపాయాలను సమకూర్చాలని మంత్రి ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ