అమరావతి, 11 సెప్టెంబర్ (హి.స.)
యాచారం, : హైదరాబాద్-అమరావతి జాతీయ రహదారిని రంగారెడ్డి జిల్లా యాచారం మీదుగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ప్రాథమిక అంచనా రూపొందించారని ముఖ్య అధికారి ఒకరు ‘న్యూస్టుడే’కు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు 12 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి అనుమతివ్వాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్రెడ్డి మంగళవారం కోరిన విషయం తెలిసిందే. ఈఅంశంపై 22న హైదరాబాద్లో సమీక్ష నిర్వహిస్తామని గడ్కరీ తెలిపినట్లు సీఎంవో కార్యాలయం తెలిపింది. హైదరాబాద్-అమరావతి నిర్మాణం ఎక్కడి నుంచి చేపడితే ప్రయోజనం ఉంటుందనే అంశంపై ఉన్నతస్థాయిలో అధికారులు ప్రతిపాదనలు చేశారు. వాటిలో శ్రీశైలం, నాగార్జునసాగర్ అంతరాష్ట్ర ప్రధాన రహదారులను కలుపుతూ చేసిన ఈ ప్రతిపాదనకు ప్రాధాన్యత తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ