అమరావతి, 11 సెప్టెంబర్ (హి.స.)జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో అటవీ అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు వారి సంక్షేమ నిధికి రూ. 5 కోట్లను జమ చేసినట్టు వెల్లడించారు. ఇందుకు గాను సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
అడవులను, వన్యప్రాణులను కాపాడే క్రమంలో తమ ప్రాణాలను అర్పించినవారిని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. వారి ధైర్య సాహసాలను స్మరించడం మనందరి బాధ్యత. వారి త్యాగం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకం. ఈ రోజు జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రాణాలు అర్పించిన త్యాగధనులకు ఘన నివాళులు అర్పిస్తున్నాను. గతంలో ఇచ్చిన హామీ మేరకు అమరవీరుల అటవీ అధికారుల కుటుంబాల సంక్షేమం కోసం రూ. 5 కోట్ల నిధులను కూటమి ప్రభుత్వం జమ చేయడం జరిగింది. దీనికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అటవీ రక్షకుల భద్రత కోసం ఆధునిక ఆయుధాలు, రక్షణ సామాగ్రి, కమ్యూనికేషన్ సదుపాయాలు, వాహనాలను అందించడంతోపాటు, అత్యవసర పరిస్థితుల్లో స్వీయరక్షణ, అక్రమ కార్యకలాపాలను ఎదుర్కోవడం, సవాళ్లను అధిగమించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అడవులు మన జాతి సంపద. వాటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి