తిరమల, 12 సెప్టెంబర్ (హి.స.)
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదాయ వనరుగా ఉన్న మద్యం అమ్మకాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే చర్చ చాలాకాలంగా జరుగుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో సంస్కరణలు చేపట్టి శ్లాబులను కుదించిన విషయం తెలిసిందే. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గి మధ్యతరగతి జీవులకు ఊరట లభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఈ క్రమంలోనే మద్యంను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్ పై మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. ఆ విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయమేనని స్పష్టం చేశారు. మద్యాన్ని జీఎస్టీ పరిధిలోకి చేర్చాలా వద్దా అనే విషయంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఈ విషయంలో తాను స్పందించేందుకు ఏమీలేదని తేల్చిచెప్పారు.
ప్రస్తుత చట్టాల ప్రకారం.. మద్యం తయారీ, అమ్మకాలపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకే ఉంది. మద్యం తయారీపై ఎక్సైజ్ సుంకం విధించడం, మద్యం అమ్మకాలపై వ్యాట్ ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి