రాయ్పుర్/న్యూఢిల్లీ,17,సెప్టెంబర్ (హి.స.) ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్ మద్యం కుంభకోణం వెనుక దాదాపు రూ.1,000కోట్ల విలువైన సిండికేట్ను వ్యక్తిగతంగా నడిపినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తులో మంగళవారం వెల్లడైంది. ఈ సిండికేట్ను నిర్వహించడానికి అప్పటి ఐఏఎస్ అధికారి అనిల్ టుటేజా, వ్యాపారవేత్త అన్వర్ ధేబర్లు సహకరించినట్లు ఈడీ ఆరోపించింది. ఇక్కడ వచ్చిన ఆదాయాన్ని స్థిరాస్తి వ్యాపారాలు, పార్టీ కార్యకలాపాలకు వినియోగించేవాడని అధికారులు పేర్కొన్నారు. మరికొందరు రాజకీయ నేతలకు కూడా ఈ కుంభకోణంతో సంబంధం ఉందని.. త్వరలో వారిపైనా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి నిందితుల మొబైల్ ఫోన్లను పరిశీలిస్తున్నట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. భూపేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.2,500 కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని పలు ఆరోపణలతో కేసు నమోదు చేసిన ఈడీ ఇటీవల ఆయన నివాసంలో సోదాలు చేపట్టింది. ఆ సమయంలో అధికారులకు సహకరించక పోవడంతో చైతన్యను ఈ ఏడాది జులై 18న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ