న్యూఢిల్లీ,17,సెప్టెంబర్ (హి.స.) భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు మళ్లీ మంగళవారం ప్రారంభమయ్యాయి. గతంలో 5 విడతలుగా ఇరుదేశాల మధ్య చర్చలు జరిగాయి. తాజాగా ప్రారంభమైన చర్చలు సానుకూల పరిష్కారం చూపుతాయేమోనన్న ఆశాభావం ఎగుమతిదార్లలో నెలకొంది. భారత్ తరపున వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం ఈ చర్చల్లో పాల్గొంటుండగా.. దక్షిణ, మధ్య ఆసియాకు అమెరికా నుంచి వాణిజ్య ప్రతినిధిగా వ్యవహరిస్తున్న బ్రెండెన్ లించ్ అమెరికా బృందానికి సారథ్యం వహిస్తున్నారు.‘వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయి. 50% సుంకాల విధింపు సముచితం కాదంటూ భారత్ వివరించింద’ని ఓ అధికారి తెలిపారు. పరస్పర ప్రయోజనకర రీతిలో ఈ ఒప్పంద చర్చలను ముగించాలని ఇరుపక్షాలు అంగీకరించాయని వాణిజ్య శాఖ తెలిపింది. దృశ్యమాధ్యమ పద్ధతిలో మున్ముందూ చర్చలు కొనసాగుతాయని, తదుపరి ప్రత్యక్ష సమావేశ తేదీని ఇరుపక్షాల అంగీకారం ఆధారంగా నిర్ణయిస్తారని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ