అమరావతి, 17 సెప్టెంబర్ (హి.స.)
పట్నంబజారు, న్యూస్టుడే: దసరా సెలవుల్లో ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నారు. స్త్రీశక్తి పథకం అమల్లోకి వచ్చాక మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దసరా రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణ అవకాశాన్ని వినియోగించుకునేవారి శాతం మరింతగా పెరుగుతుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం జిల్లాలోని ఐదు డిపోల నుంచి 242 అదనపు బస్సులు నడపాలని నిర్ణయించారు. ఏటా దసరా రోజుల్లో ప్రత్యేక సర్వీసులు నడిపేది. ఈసారి మహిళల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ముందు నుంచే కసరత్తు చేస్తున్నారు.
మార్గమధ్యలో బస్సులు బ్రేక్ డౌన్ కాకుండా ఉండేందుకు అధికారులు సకల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిత్యం గ్యారేజీలకు వచ్చిన వెంటనే వాటి సామర్థ్యాన్ని మెకానిక్లు పరిశీలిస్తున్నారు. ఇందుకోసం ఐదు డిపోల పరిధిలో 180 మంది పని చేస్తున్నారు.
దూర ప్రాంతాలకు... దసరా సెలవులకు దూర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే ప్రయాణికుల కోసం అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నారు.
గుంటూరు నుంచి హైదరాబాద్కు 20, చెన్నైకు 6, బెంగళూరుకు 6, విశాఖపట్నానికి 5 బస్సులు నడపనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ