అమరావతి, 18 సెప్టెంబర్ (హి.స.)ఎంబీఏ పూర్తయింది.. పెళ్లై పది నెలలైంది.. కొలువుల వేటలో ఓ ఇంటర్వ్యూకు వెళ్తూ మృత్యు ఒడికి వెళ్లింది ఓ నవ వధువు. మాక్లూర్ మండలం దాస్నగర్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మామ, కోడలు మృతి చెందారు. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. నందిపేట్ మండలం తల్వెద గ్రామానికి చెందిన నీరిడి చింటుకు, కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూర్కు చెందిన పూజ(25)కు పది నెలల కిందట వివాహమైంది. ఎంబీఏ పూర్తిచేసిన ఆమెకు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఈనెల 17న ఇంటర్వ్యూకు హాజరుకావాలని చెప్పింది. బుధవారం ఉదయం 6 గంటలకు నిజామాబాద్లో అజంత ఎక్స్ప్రెస్ రైలు ఎక్కి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఉదయానే ద్విచక్రవాహనంపై భార్యాభర్తలతో పాటు చింటు తండ్రి నారాయణ(62) బయలుదేరారు. దాస్నగర్ సమీపంలో బైక్ అదుపు తప్పడంతో ముగ్గురూ కింద పడ్డారు.
నీరడి నారాయణకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆయన కోడలు, కొడుకులకు గాయాలు కావడంతో ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పూజ మృతి చెందింది. ఘటనా స్థలాన్ని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్అలీ పరిశీలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ