కర్నూలు, 2 సెప్టెంబర్ (హి.స.)భోజనం చేశాక పాన్ లేదా సోంపు తినడం భారతీయ సంస్కృతిలో ఎప్పటి నుంచో ఉన్నదే. జీర్ణక్రియను వేగవంతం చేసేందుకు పెద్దలు ఈ అలవాటును ప్రోత్సహించారు. పాన్, సోంపుతో పాటు కొందరు భోజనం చేశాక ఇలాచీ కూడా తింటుంటారు. మరి ఈ అలవాటుతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇలాచీ కేవలం మౌత్ ఫ్రెషనర్గానే కాకుండా ఇంకా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఇలాచీ ప్రస్తావన ఉంది. అందుకే దీన్ని సుంగధ ద్రవ్యాల రాణిగా పిలుస్తారు. ఎక్కువ మంది దీన్ని మౌత్ ఫ్రెషనర్గానే వాడతారు. ఇందులోని సహజసిద్ధమైన నూనెలు నోటి బ్యాక్టీరియాను అంతమొందించి దుర్వాసన లేకుండా చేస్తాయి. ముఖ్యంగా వెల్లుల్లి, ఉల్లిపాయ తిన్న తరువాత ఇలాచీ ఎంతో ఉపయోగపడుతుంది.
ఇలాచీలోని సినియోల్, ఇతర రసాయనాలు కడుపులో జీర్ణరసాలు మెరుగ్గా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. త్వరగా ఆహారం బాగా జీర్ణం అవుతుంది. భోజనం తరువాత ఇలాచీ నమిలితే కడుపుబ్బరం, గ్యాస్, ఎసిడిటీ వంటివి కనుమరుగు అవుతాయి. కడుపు కండరాలు రిలాక్స్ అయ్యి ఇబ్బందులు తొలగిపోతాయి.
ఇలాచీలోని యాంటీఆక్సిడెంట్స్.. లివర్, కిడ్నీని మరింత క్రియాశీలకం చేసి విషతుల్యాలు తొలగిపోయేలా చేస్తాయి. క్రమం తప్పకుండా ఇలాచీ తినేవారిలో విషతుల్యాల తొలగింపు మరింత మెరుగ్గా ఉంటుంది.
ఇలాచీ తినే వారిలో ఆకలిపై కూడా అదుపు ఉంటుంది. స్వీట్స్, చక్కెర అధికంగా ఉన్న ఇతర పదార్థాల మీద మనసు మళ్లకుండా ఇలాచీ అడ్డుకట్ట వేస్తుంది.
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి