న్యూఢిల్లీ, 02 సెప్టెంబర్ (హి.స.)మరాఠా రిజర్వేషన్ల ఉద్యమకారులకు బాంబే హైకోర్టు ఆదేశం
ముంబయి: మరాఠా రిజర్వేషన్ల ఉద్యమకారులు, వారి నేత మనోజ్ జరాంగేపై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసన అనుమతి నిబంధనలను ఉల్లంఘించడం ద్వారా ముంబయి నగర జీవనాన్ని స్తంభింపజేశారని జస్టిస్ రవీంద్ర ఘూగే, జస్టిస్ గౌతమ్ అఖండ్ ధర్మాసనం మండిపడింది. నగరంలోని కీలకమైన ప్రాంతాలన్నీ వాహనాలతో నిండిపోయాయని పేర్కొంది. వీధుల్లోనే స్నానాలు, వంటలు, భోజనాలు చేస్తున్నారని మండిపడింది. జరాంగే మద్దతుదారులు మంగళవారం మధ్యాహ్నానికల్లా పరిస్థితిని చక్కదిద్దాలని, వీధులను ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించింది. జరాంగే నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన దక్షిణ ముంబయిలోని ఆజాద్ మైదానంలోనూ ఆందోళనకారులు ఉండటానికి వీల్లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో ఓబీసీ కేటగిరీలో మరాఠా సామాజిక వర్గానికి 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఉద్యమకారుడు మనోజ్ జరాంగే చేపట్టిన ఆందోళన శాంతియుతంగా ఏమీ జరగడంలేదని బాంబే హైకోర్టు ఆక్షేపించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. జరాంగే నిరసనకు ఆగస్టు 29 వరకే మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని అంతకుముందు వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ బీరేంద్ర సరాఫ్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ